ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా మరింత సహకారం అందించాలని సీఎం ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పని చేద్దామని కోరారు. భారత పర్యటనలో ఉన్న ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సీఎం వారితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో జరిగిన ఈ సమావేశంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆగా ఖాన్ ఫౌండేషన్పై అత్యంత గౌరవం ఉందని పేర్కొంటూ, హైదరాబాద్తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఫౌండేషన్ సహకారంతో ఇటీవల శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించడం, అలాగే నగరంలోని కుతుబ్ షాహీ టూంబ్స్ను పునరుద్ధరించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.హైదరాబాద్ నగర పునర్నిర్మాణంలో భాగంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై సిద్ధం చేసిన ప్రణాళికలను సీఎం వివరించారు. మూసీ నది వెంట నైట్ ఎకానమీ కార్యకలాపాల దిశగా తీర్చిదిద్దుతున్న విషయాలను తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న చారిత్రక సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో సహకరించాలని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు వివరించారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలోనిర్వహించబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సమ్మిట్కు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రిన్స్ ఆగా ఖాన్-V ఆసక్తిని కనబరిచి దాని ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు. దీనికి ఆగా ఖాన్ సమ్మతం తెలిపారు.
Admin
E Nivas News