ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అమ్మనమడుగు ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీరందడం లేదని నిధుల దుర్వినియోగంపై విచారణ జలపాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవా విజయకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామెరి మండలం కేస్లాగూడలోని 'అమ్మన మడుగు ప్రాజెక్టు' ద్వారా ఒక్క ఎకరం వ్యవసాయ భూమికి కూడా సాగునీరు అందించడంలో గత ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము పూర్తిగా విఫలమయ్యాయని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వైఫల్యాలను, నిధుల అక్రమాలను ఎండగట్టారు. "దాదాపు 25 సంవత్సరాల క్రితమే 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ చెరువును (ప్రాజెక్టు) నిర్మించారు. కానీ, దీనికి దిగువన ఉన్న కేస్లాగూడ, కేరామెరి గ్రామస్థుల భూములకు నేటికీ ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందడం లేదు. గతంలోనూ ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చినట్లు ప్రకటించారు, కానీ ఆ నిధులు ఎటు పోయాయో, ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో ఇప్పటికీ పత్తా లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు రిపేర్ల నిమిత్తం రూ. 11.76 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపిందని గుర్తు చేశారు. కానీ, నేటి వరకు ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసి అభివృద్ధి చేయలేదని, ఎలాంటి రిపేర్ పనులు చేపట్టలేదని మండిపడ్డారు. ప్రాజెక్టు కాలువలను కూడా అసంపూర్తిగా తవ్వించి అలానే వదిలేశారని, ఆ కాలువల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే నిధులు మంజూరు చేసినట్లుగాఅనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు తక్షణమే స్పందించి అమ్మన మడుగు ప్రాజెక్టును త్వరితగతిన అభివృద్ధి చేసి, రైతులకు సాగునీరు అందించాలి. ఈ ప్రాజెక్టు పేరుతో గతంలో మరియు ప్రస్తుతం మంజూరు చేసిన నిధులపై *ప్రత్యేక విచారణ జరిపించాలి. ప్రభుత్వం మరియు అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి స్పందించకపోతే, కేస్లాగూడ గ్రామ పంచాయతీ, కేరామెరి గ్రామ పంచాయితీ పరిధిలోని ప్రజలందరినీ, రైతులను ఏకం చేసి భారీ ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Admin
E Nivas News