ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్షేట్టిపేట ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పాలనలో కాంగ్రెస్ మార్క్ చూపిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాల, కళాశాల నిర్మించి ఆదర్శంగా నిలిచామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంతో తెలంగాణ అభివృద్ధి బులెటిన్ లో ప్రచురితం అవడం మనకు గర్వకారణమని తెలిపారు. అమృత్ పథకం,పలు రోడ్లకు ఇప్పటికే నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయని వివరించారు. వచ్చే రెండేళ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపడుతామని వెల్లడించారు. వెంకట్రావు పేట్ సోలార్ ప్లాంట్ తో మొదటి గ్రామంగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే 4 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో సాగునీరు అందేలా ప్రణాళికలు రూపొందించమని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందే ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసి రాష్ట్రంలోనే అభివృద్ధి పరంగా నియోజకవర్గంను రెండవ స్థానంలో నిలుపుతామన్నారు. సన్నబియ్యం, రేషన్ కార్డ్స్ ఇస్తూ ప్రజలకు అండగా ఉన్నామన్నారు. మెప్మా ఐకేపీ ద్వారా కోటి మంది మహిళలకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ఇండస్ట్రియల్ పార్క్, ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్, దండేపల్లి లో మోడల్ స్కూల్ తో పాటు పలు పాఠశాలల్లో ఇప్పటికే రూ. 45 కోట్లతో మౌళిక సదుపాయాలు కల్పించామన్నారు. తలసరి ఆదాయంలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో ఉందని వెల్లడించారు. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల కష్ట ఫలితమే నేడు తాను ఎమ్మెల్యేగా ఉండటానికి కారణమని ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా మున్సిపాలిటీ ప్రజలు తమ ఓటును కాంగ్రెస్ కు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి తనదే బాధ్యత అంటూ పునరుద్ఘాటించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ గా దొంత అంజలి, వైస్ చైర్మన్ గా చల్లా నాగభూషణం, ఇతర వార్డ్ కౌన్సిల్ అభ్యర్థులను ప్రకటించారు. పలువురిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అందరికీ త్వరలోనే న్యాయం చేస్తుందని కార్యకర్తలకు హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు ఆరీఫ్, ఆర్ జీ పీ ఎస్అధ్యక్షులు త్రిమూర్తులు, ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్, సర్పంచ్ లు నలమెల రాజు, సత్యన్న, మున్సిపాలిటితో పాటు పలుగ్రామాల ప్రజలుపాల్గొన్నారు.
Admin
E Nivas News