ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో జరుగనున్న ఇంటర్మీడియట్, 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు . గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుండి మార్చి 16వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణ కొరకు జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రథమ సంవత్సరంలో జనరల్ 5 వేల 372 మంది, ఒకేషనల్ 888 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ 5 వేల 227 మంది, ఒకేషనల్ 830 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోసిట్ పరీక్ష ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.50 వరకు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 నుండి 11 వరకు, ఎస్.ఎస్.సి. ఒకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్ష ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు, మినహా మిగతా పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందు కొరకు జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 9 వేల 703 మంది రెగ్యులర్, 45 మంది ఒక్కసారి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష సమయంలో 163 బి. ఎన్. ఎస్. ఎస్. సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష సమయానికి అనుకూలంగా టి.జి.ఎస్.ఆర్.టి.సి. అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షించాలని, ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, ప్రశ్నా, జవాబు పత్రాల సురక్షిత రవాణా కొరకు తపాలా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలోని పరీక్ష కేంద్రాలలో పారిశుద్ధ్యం నిర్వహణ పకడ్బంధీగా నిర్వహించాలని తెలిపారు. ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లుగా అవాస్తవాలను ప్రచారం చేసినట్లయితే సంబంధిత వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సులభంగా జీర్ణమయ్యే ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, పరీక్షల సమయంలో వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులు పరీక్ష నిబంధనలను పాటించేలా అవగాహన కల్పించాలని, జిల్లాలో వార్షిక పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News