ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు మంచిర్యాల జోన్లో గూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వాహనాల తనిఖీలను పర్యవేక్షించారు. చెక్పోస్టుల వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించిన డీసీపీ, విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనల జారీచేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు.ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.అక్రమ పశువుల రవాణాపై పటిష్ట నిఘా కొనసాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, అనుమానాస్పద రవాణా గమనించినట్లయితే స్థానిక పోలీసులకు లేదా 100 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు.విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని,భద్రతా ప్రమాణాలనుఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. డీసీపీ వెంట మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి,ఎస్సై సురేష్,దండేపల్లి ఎస్సై తైసినోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News