ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థినుల ఫోన్లు లాక్కొని సంక్రాంతి పండుగకు పంపించకుండా గదుల్లో నిర్బంధించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన విద్యార్థినుల స్వేచ్ఛ, భద్రత, మానవ హక్కులపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లోఅదీ బాలికల హాస్టళ్లలో ఇలాంటి చర్యలు చోటుచేసుకోవడం ఆందోళనకరం. పండుగ అనేది కుటుంబాలతో గడిపే సమయం కాబట్టి అలాంటి వేళ, సరైన ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్ను ఆపివేయడం, నిర్బంధం వంటి పరిస్థితులు సృష్టించడం నైతికంగా, పరిపాలనపరంగా సమర్థనీయం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి దృష్టికి వెళ్లగానే ఆమె వెంటనే స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి, హిందూ విద్యార్థినులను తక్షణమే వారి సొంతింటికి పంపించాలని కోరినట్లు సమాచారం. దీనిపై జిల్లా వైద్యాధికారి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థినులపై పాలకులుగా కాకుండా, సంరక్షకులుగా వ్యవహరించాల్సిన బాధ్యత హాస్టల్ నిర్వాహకులది. నియమాలు ఉంటే అవి స్పష్టంగా, సమానంగా, మానవీయంగా అమలవ్వాలి. మతం, లింగం, నేపథ్యం అనే తేడాలు లేకుండా విద్యార్థినులందరికీ సమాన హక్కులు కల్పించాల్సిందేనని, ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్ పరిపాలనపై పర్యవేక్షణ పెంచడం, ఫిర్యాదు వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యవసరం. విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబడాలంటే పండుగ వేళ విద్యార్థినుల కన్నీళ్లు కాకుండా, వారి ముఖాల్లో ఆనందమే కనిపించాలని, ప్రభుత్వం తీసుకునే చర్యలే రేపటి ప్రమాణాలకు అద్దం పడతాయి అనడంలో సందేహంలేదనే సర్వత్ర అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Admin
E Nivas News