ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ, సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చే కీలక శక్తులు ఉద్యోగులు. అయితే, ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు, దక్కాల్సిన న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యోగ వర్గాలు నేడు పోరు బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తమ నాలుగు ప్రధాన డిమాండ్ల సాధన కోసం దశలవారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి అడుగుగా ఆగస్టు 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఉద్యోగులు భారీ ఎత్తున మహాధర్నాలు నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో సెప్టెంబర్ 1న 'పెన్షన్ విద్రోహ దినం' సందర్భంగా మరోసారి కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు ధర్నాలకు దిగారు. ఈ ఉద్యమ పరంపరలో అత్యంత కీలక ఘట్టంగా సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో భారీ మహాధర్నాకు జేఏసీ పిలుపునిచ్చింది. 6 డీఏలు పెండింగ్లో ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన కరువు భత్యం వాయిదాలు వరుసగా పేరుకుపోయి ప్రస్తుతం దాదాపు 6 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ డీఏలు సకాలంలో విడుదల కాకపోవడంతో, ఉద్యోగం,ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పీఆర్సీ ఆలస్యం కారణంగా క్యాడర్ను బట్టి సగటున ఒక్కో ఉద్యోగి నెలకు ₹10,000 నుండి ₹25,000 వరకు నష్టపోతున్నారు. ఈ సుదీర్ఘ నిరీక్షణ వల్ల మొత్తంగా ప్రతి ఉద్యోగికి ఇప్పటివరకు దాదాపు ₹3 లక్షల నుంచి ₹5 లక్షల రూపాయలకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ఈ జాప్యం వారి కుటుంబ ఆర్థిక ప్రణాళికలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగుల చిరకాల ఆకాంక్ష అయిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని స్పష్టమైన వాగ్దానం చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడిచినా ఆ కీలక హామీ నేటికీఅమలుకు నోచుకోకపోవడం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఉద్యోగులు, ఉపాధ్యాయులలో తీవ్ర నిరాశను, అభద్రతాభావాన్ని కలిగిస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత ప్రశాంత జీవితాన్ని, సామాజిక భద్రతను అందించే ఏకైక మార్గం పాత పెన్షన్ విధానమే. ఉద్యోగుల సేవలను గుర్తించి, ఎన్నికల వేళ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలి. సీపీఎస్ను తక్షణమే రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించడం ద్వారా ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. బకాయిలు క్లియర్ కావాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి సంబంధించి జీపీఎఫ్ , సరెండర్ లీవులు, మెడికల్ రీయింబర్స్మెంట్, గ్రాట్యుటీ తదితర రూపాల్లో దాదాపు ₹10,000 కోట్ల నుంచి ₹16,000 కోట్ల మేర బిల్లులు ట్రెజరీల్లో పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం నెలకు సుమారు ₹700 కోట్ల నుండి ₹2000 కోట్ల చొప్పున గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను విడుదల చేస్తోంది. అయితే, ఉద్యోగ విరమణ చేసిన వారికి తక్షణఆర్థికఉపశమనం లభించాలన్నా, పేరుకుపోయిన మొత్తం బకాయిలు త్వరితగతిన పూర్తిగా క్లియర్ కావాలన్నా ప్రభుత్వం నెలకు కనీసం ₹3000 కోట్ల నుంచి ₹4,000 కోట్ల నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఉద్యోగుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 10న ఎల్బీ స్టేడియంలో జేఏసీ తలపెట్టిన ఈ మహాధర్నా ప్రభుత్వానికి ఒక స్పష్టమైన హెచ్చరిక లాంటిది. ప్రభుత్వ పాలనను ముందుకు నడిపించే ఉద్యోగుల సమస్యలను ఇకపై ఉపేక్షించడం సరికాదు. కొత్త పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, బిల్లుల తక్షణ విడుదల, సీపీఎస్ రద్దు వంటి నాలుగు ప్రధాన డిమాండ్లపై పాలకులు కాలయాపన చేయకుండా తక్షణమే స్పందించాలి. ఉద్యోగులతో గౌరవప్రదమైన చర్చలు జరిపి, ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చినప్పుడే ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అభద్రతాభావం తొలగిపోతుంది. ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకొని సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తుందని ఆశిద్దాం. లేనిపక్షంలో ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చడం ఖాయం అని మేధావులు హెచ్చరిస్తున్నారు. నేటి మహాధర్నా వాయిదా వేస్తున్నాం... ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ నిరసన విషయంపై స్పందించిన మంత్రులు ఉపాధ్యాయ సంఘాల నాయకులను చర్చకు రావాలని పిలిచారు. మీకు న్యాయం చేస్తామని చెప్పడంతో ఉద్యమ సంఘాల నాయకులు సమ్మెను వాయిదా వేసినట్లు తెలిపారు. విషయాన్ని గమనించాలని ఉపాధ్యాయ మిత్రులకు సూచించారు.
Admin
E Nivas News