ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అన్ని విభాగాల అధికారులకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహకులు, మున్సిపల్, ఎంపీడీవోలు, ఇరిగేషన్, సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలిసి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ధాన్యం వరి పత్తి తదితర ధాన్యాలను తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా రైతులకు సమాచారం అందించాలని సూచించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వర్షంలో తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. పశు సంపదకు, పంట, ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ, రైతులను, పశువుల కాపరులను, సామాన్య ప్రజలకు ముందస్తు సమాచారాలు అందించాలని సూచించారు. వర్షాలు తగ్గే వరకు పశువులను మేతకు బయటకు తీసుకుపోకూడదని పశువుల పాకలోనే సురక్షితంగా ఉంచాలని సూచించారు. ప్రమాదకర స్థాయిలో ప్రవహించే జలపాతాలు, చెరువులు, కుంటలు, కెనాళ్ళు, వద్దకు ప్రజలు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. లో లెవెల్ వంతెనలు జలాశయాలను డ్యామ్లను చెరువులను తెగిపోకుండా ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ నిత్యం సిబ్బంది అందుబాటులో ఉంటారాని, వర్షాలు వరదలు వలన ఎలాంటి ఇబ్బందులు కలిగిన ఈ నెంబర్లు సంప్రదించాలన్నారు. (7995074803) ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందించి సహాయక చర్యలు తీసుకుని సంబంధిత సిబ్బందికి సమాచారం అందించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. విష జ్వరాలు ప్రబలకుండా కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ముందస్తు చర్యలు చేపట్టాలని తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది కచ్చితంగా వారి ప్రధాన కార్య స్థానంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని తెలిపారు.
Admin
E Nivas News