ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అభినవ శబరిమలిగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెం అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం గురుస్వామి శ్రీశ్రీశ్రీ చక్రవర్తుల పురుషోత్తమాచార్య ఆధ్వర్యంలో మహా మండలపూజను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ హాజరై తమ మొక్కలు చెల్లించుకున్నారు. ప్రతి ఏట గూడెం అభినవ శబరిమలలో వేలాదిమంది స్వాములు దీక్షలు తీసుకోవడంతో పాటు ఇక్కడే మాలలు కూడా విరమణ చేస్తుంటారు. వచ్చిన స్వాములందరికీ మకరజ్యోతి దర్శనం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కార్తీక మాసం పురస్కరించుకొని మకర సంక్రాంతి వరకు ఈ ఆలయంలో గురుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర లోని పలు జిల్లాల నుండి కూడా వందలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడే మాల వేసుకుని మాల విరమణ కూడా చేస్తారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. మకర సంక్రాంతి పర్వదినాన ఇదే ప్రాంతంలో మకరజ్యోతి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో సమీపాన్ని సత్యదేవుని ఆలయంతో పాటు సాయిబాబా ఆలయాలు కూడా ఉండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. వచ్చిన భక్తులు స్వాములంతా ముందుగ ఆలయాల సమీపంలో గల పుణ్య గోదావరిలో స్నానాలు ఆచరించి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటారు.
Admin
E Nivas News