ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా గంపల పెళ్లి కొత్తూరు గ్రామాలలో జరిగిన ప్రమాదంలో గోడ కూలి రైతులకు మృతి చెందగా ఆ ప్రదేశాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, లక్షెట్టిపేట తహసిల్దార్ దిలీప్ కుమార్, డి సి సి ప్రతినిధి రఘునాథ్ రెడ్డి, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. అకాల వర్షం కారణంగా లక్షెట్టిపేట మండలం కొత్తూరు లోని కొనుగోలు కేంద్రంలో జరిగిన ప్రమాదంలో రైతులు మృతి చెందడం బాధాకరమని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారంలో భాగంగా రవాణా ప్రక్రియలో లారీ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, కొత్తూరు కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ధాన్యాన్ని నెల్కివెంకటాపూర్ లోని గోదాముకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అకాల వర్షం కారణంగా ప్రమాదంలో మృతి చెందిన కొత్తూరు గ్రామానికి చెందిన వెంకటేష్, గంపలపల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు తనుగుల నాగరాజు, అభిరామ్ కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కి లచ్చన్న కుటుంబాన్ని జిల్లా కలెక్టర్, దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే లతో కలిసి పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ముందుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, లక్షెట్టిపేట మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి మండలంలోని మిట్టపల్లి లో శ్రీరామకృష్ణ ట్రేడర్స్ రైస్ మిల్లును సందర్శించి అక్కడ నెలకొన్న లారీ ధాన్యం దిగుమతి, హమాలీల సమస్యను పరిష్కరించే దిశగా వారితో సమీక్షించారు. ప్రభుత్వం లారీలతో పాటు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణాకు అవకాశం కల్పించిందని, లారీల నిర్వాహకులు సహకరించాలని, ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా జరిగేలా హమాలీలు కలిసి రావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో హమాలీలు, లారీల నిర్వాహకులు జిల్లా కలెక్టర్ చెప్పిన అంశాలను అంగీకరించడంతో పరిస్థితి అనుకూలంగా మారింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News