ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంథని ప్రాంత అభివృద్ధి కోసం పరిశ్రమలను తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించామని, కోకాకోలా వంటి బహుళజాతి సంస్థ మంథనిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం మంథనిలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మలతో కలిసి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఇంజినీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు ATC, NAC స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, NAC స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు రూ.20 కోట్లు కేటాయించామన్నారు. ఎనిమిది నెలల్లో కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. అప్పటివరకు సెంటినరీ కాలనీలో ఉన్న సింగరేణి భవనాలలో నాక్ కేంద్రం నడపాలని ఆయన సూచించారు. మంథని ప్రాంతానికి గత రెండున్నరేళ్లలో సుమారు రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మంథని పట్టణంలోని బ్రిడ్జి నుంచి బస్ డిపో వరకు రూ.15 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని, మానేరు నదిపై కూడా వంతెన మంజూరైందన్నారు. గోదావరి నదిపై హై లెవల్ బ్రిడ్జి, అవసరమైన రహదారి విస్తరణ పనులకు నిధులు మంజూరు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రహదారి పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మంథని ప్రాంతంలో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించాలని మంత్రి సూచించారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించి వరి సాగును తగ్గించాలని కోరారు. ఆయిల్పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మంథని మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, రామగుండం మేయర్ ఎం. స్వామి, డిప్యూటీ మేయర్ పారుపల్లి ఎల్లయ్య,విద్యుత్ శాఖ సలహాదారు కాచే శశిభూషణ్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News