ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 14వ తేదీన జరగనున్న 2వ విడత పోలింగ్ నిర్వహణ కొరకు ఎన్నికల సామాగ్రిని కేటాయించిన ప్రకారం ప్రణాళికాబద్ధంగా పంపిణీ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని వేమనపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 2వ విడత ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుమారస్వామి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఓటింగ్, కౌంటింగ్ కొరకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 13వ తేదీన అధికారులు నిర్దేశిత సమయానికి తమకు కేటాయించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలలో రిపోర్టు చేయాలని, ఆయా పోలింగ్ కేంద్రాల వారిగా కేటాయించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. 2వ విడతలో భాగంగా ఈ నెల 14వ తేదీన జిల్లాలోని బెల్లంపల్లి, భీమిని,కన్నేపల్లి, నెన్నెల,కాసిపేట, తాండూర్, వేమనపల్లి మండలాలలో గ్రామపంచాయతీ సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.పోలింగ్, పోలింగ్ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించడం జరుగుతుందని,ఈ నెల 14వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు.అర్హత గల ప్రతి ఒక్కరూ నిర్భయంగా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించాలని, అధికారులు, vమీడియా ప్రతినిధులు అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకమైన ఎన్నికలు జరిగేలా అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News