ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ శాఖ అధికారి ఇంటి బెడ్ రూమ్ లోనీ బీరువాలో దాచి ఉంచిన రూ. 26 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు అటవీశాఖ అధికారి కాగా, నిందితుడు మాజీ ప్రజా ప్రతినిధురాలి భర్త కావడం గమనార్హం. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ కు చెందిన అటవీశాఖ అధికారి గుడిమల్ల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా తీగల గుట్ట మణికేశ్వర నగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల స్వగ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని 26 లక్షలకు విక్రయించారు. ఆ నగదును తన అద్దె ఇంటిలో దాచిపెట్టగా, ఈ మధ్యలో ఆ డబ్బు అవసరం పడలేదు. గత నెల చివరి వారంలో డబ్బు అవసరం ఉండడంతో ఓ రోజు ఆ గదికి వెళ్లి చూడగా తాళం ధ్వంసం చేసి ఉంది. తీసుకొచ్చిన రూ 26 లక్షలు దొంగతనానికి గురయ్యాయి. తన ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుసుకొని ఇంతకు ముందు ల్యాప్ టాప్ దొంగతనం చేసిన వ్యక్తే తన ఇంట్లోని నగదును దొంగతనం చేశాడని బాధితుడు నిర్ధారణకు వచ్చాడు. అదే విధంగా గత నెలలో తన ఇంటికి వచ్చి వెళ్లిన తన స్నేహితుడు దొంగతనం చేసినట్లు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు సదరు ఆ వ్యక్తి దొంగతనం చేసినట్లు నిర్ధారించి మంగళవారం నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంకెవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటవీ క్షేత్ర అధికారి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Admin
E Nivas News