ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సహచర ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై మధుసూదన్ దంపతులకు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆయన విద్యా సేవలను కొనియాడుతూ జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బిరుదు మధుసూదన్ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలను పెంపొందించడంలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు ప్రభుత్వ పాఠశాలలో సేవలందించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గురువుకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో మధుసూదన్ అందించిన మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మధుసూదన్ మాట్లాడుతూ తన సేవాకాలంలో సహకరించిన విద్యాశాఖ అధికారులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం విద్యార్థులతో అనుబంధాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు దుద్దిల శ్రీనుబాబు, మున్సిపల్ ఛైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సాహెందర్ రెడ్డి, ఎంఈఓ డి. లక్ష్మి, విశ్రాంత ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, మోహన్ శర్మ, ఉపాధ్యాయుల సంఘాల జిల్లా, మండల నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలతతో పాటు సహచర ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.
Admin
E Nivas News