ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ లో బారాస హాయంలోనే అభివృద్ధి జరిగిందని, మరోసారి అవకాశం ఇస్తే మరింతగా అభివృద్ధి చేస్తామని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు . శనివారం సాయంత్రం మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ లో గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయని నిలదీశారు. మహిళకు రూ. 2500,తులం బంగారం, రూ. 2 లక్షల రుణమాఫీ, ఉచిత స్కూటీ లు, పెంచిన పెన్షన్ లు ఏమయ్యాయని ప్రశ్నించారు. నియోజకవర్గంలో సుమారు 25 వేల మంది మహిళలు ఆర్ధిక సహకారం లేకుండా నష్టపోతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెబితేనే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పెట్టడమనేది ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. 10 నెలల్లో లక్షేట్టిపేట, నస్పూర్, మంచిర్యాలలో కేవలం 3 సార్లు మాత్రమే మీటింగ్ లు పెట్టి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యేకు,ఇతర నాయకులకు పట్టింపు లేదన్నారు. తాము గత ఐదేళ్లలో హాస్పిటల్, ఇంటిగ్రెటెడ్ మార్కెట్, మోడల్ డిగ్రీ కాలేజ్, కస్తూరిభా పాఠశాల నిర్మాణాలతో పాటు ప్రతి వార్డ్ లో సీసీ రోడ్డు వేశామన్నారు. గోదావరి వరకు రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తో మున్సిపాలిటీని అభివృద్ధి చేసినట్లు వివరించారు. వ్యాపార వర్గాలను ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇబ్బంది పెట్టలేదన్నారు. తప్పు చేసే కార్యకర్తలను హెచ్చరించినట్లు పేర్కొన్నారు. కానీ నేడు ఎమ్మెల్యే తీరు ఆధారంగా యధా రాజ తధా ప్రజా అనే స్థితిలో కింది స్థాయి నాయకులు నడుచుకుంటున్నారని ఆయన విమర్శించారు. గులాబీ జెండాతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. పట్టణాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజలున్నారని తెలిపారు. అంతకుముందు మాజీ మున్సిపల్ చైర్మన్ కాంతయ్య మాట్లాడుతూ రూ. 25 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. పారిశుద్ధ్యం,అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేసినట్లు వివరించారు. అంతకుముందు మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ డమ్మీ అభ్యర్థులను చైర్ పర్సన్ చేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని తెలిపారు. ప్రజా సమస్యలపైఅవగాహన అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంట్లోనే ఉండి రాజకీయం చేసే నాయకులు ప్రజల సమస్యలను ఎలా తీర్చుతారని ప్రశ్నించారు. అనంతరం పలు వార్డ్ ల అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే ప్రకటించారు. త్వరలో పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం పలువురికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News