ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో వానాకాలం 2026-27 సీజన్కు సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు చర్యలు తీసుకొని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపుp కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2026-27లో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గోదాములను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని, ధాన్యం కొనుగోళ్ల కొరకు సంబంధిత ఏజెన్సీలతో ముందస్తు సమావేశాలు నిర్వహించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎట్టి పరిస్థితులలోనూ లోతట్టు ప్రాంతాలలో ఏర్పాటు చేయరాదని, ఎత్తైన ప్రాంతాలలో నీరు నిల్వఉండకుండా చదునుగా ఉన్న అనుకూల ప్రదేశాలను ఎంపిక చేసి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయఅధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలకు తరచుగా అడిగే ప్రశ్నలుపై అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలు, కొనుగోలు విధానం తదితర అంశాలపై రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర అవసరమైన సదుపాయాలను ముందుగానే సమకూర్చేలా చర్యలు చేపట్టాలనిఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలనిసూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధితఅధికారులు తదితరులుపాల్గొన్నారు.
Admin
E Nivas News