ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాటమే తన లక్ష్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆమెకు కరీంనగర్ చౌరస్తా నుండిఉత్కూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ రక్షణ సేన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కవిత మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా పేద ప్రజల బతుకులలో ఏమాత్రం మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పేద ప్రజలు ఏదో ఒక రకమైన ఇబ్బందుల్లో ఉన్నారని వారందరికీ న్యాయం జరగాలంటే తమ ప్రభుత్వం వచ్చాక వారందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తా అన్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులందరికీ ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఫీజు లేకుండా విద్యను అందించే పథకాన్ని ప్రవేశపెడతానన్నారు. అలాగే ఇప్పటికీ పేద ప్రజలకు సరైన వైద్యం లేక ఎంతో మంది విగత జీవులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంతో మంది యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారందరికీ కూడా నా ప్రభుత్వం వచ్చాక ఏదో ఒక రకమైన ఉపాధి కల్పిస్తానని అన్నారు. అనంతరం కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాల నాయకుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల బతుకులు మార్చే అంతవరకు నిద్రపోనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడ జనార్ధన్, ని షాలేనిన్, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News