ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బ్యాలెట్పేపర్లముద్రణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ కొరకు ఎంపిక చేసిన శారద ప్రింటింగ్ ప్రెస్ ను కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించి ముద్రణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అర్హత గల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఎన్నికల గుర్తులు కేటాయించడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 240 మంది, బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో 173 మంది, చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 18 వార్డులలో 107 మంది, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 22 వార్డులలో 113 మంది, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 15 వార్డులలో 60 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. జిల్లాలోని 1 మున్సిపల్ కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలలో మొత్తం 693 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించడం జరిగిందని, ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం బ్యాలెట్ పేపర్ల ముద్రణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్, 12వ తేదీన రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే), 13వ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News