ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1వ తేదీన ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ – XII, నెల రోజుల వ్యవధిలో నిర్మల్ జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో దిగ్విజయంగా కొనసాగిందని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల బుధవారం తెలిపారు. దీనికి నోడల్ ఆఫీసర్ గా అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఆపరేషన్ స్మైల్ బృందం విసృత గాలింపు చర్యల్లో భాగంగా, జిల్లాలో ముఖ్యంగా హోటల్ల యందు,పశువులు కాసే వద్ద, వెల్డింగ్ షాప్ ల వద్ద,నిర్మాణ పనుల నందు, వ్యాపార సముదాయాల నందు పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించారు. జిల్లాలోని బాలబాలికలు పాఠశాలకు బదులు పనిలోకి వెళ్తున్న వారిని గుర్తించి ఆపరేషన్ స్మైల్ – XII బృందం వారిని రెస్క్యూ చేసి మళ్ళీ బడికి వెళ్ళేలా ప్రోత్సహించడం జరిగింది. పెంబి గ్రామంలో గొర్రెల కాపరిగా పనిచేస్తున్న 12 ఏళ్ల బాలుడిని గుర్తించిన స్మైల్ బృందం, తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ నిర్వహించి తిరిగి పాఠశాలలో చేర్పించారు. అతనికి స్కూల్ యూనిఫాం, పుస్తకాలు అందజేయడంతో పాటు హాస్టల్ వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు. భైంసా పట్టణంలో రాయల్ పౌల్ట్రీ అండ్ చికెన్ షాప్ లో బుచర్గా పనిచేస్తున్న 11 ఏళ్ల బాలుడను రక్షించి, యజమాని పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన 13 ఏళ్ల బాలిక 4వ తరగతి మధ్యలోనే చదువు మానేసి లోకేశ్వరం మండలం రాయపూర్ (కే) సమీపంలోని ఇటుక బట్టీలో 200 ₹ రోజువారి కూలీగా పనిచేస్తుండగా ఆమెను గుర్తించి, యజమాని పై కేసు నమోదు చేసి తిరిగి స్కూల్లో చేర్పించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలానికి చెందిన 13 ఏళ్ల బాలుడు ₹5000 వేతనంతో బాసరలోని గోదావరి ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద గొర్రెల కాపరిగా పనిచేస్తుండగా, స్మైల్ బృందం రెస్క్యూ చేసి యజమాని పై కేసు నమోదు చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. 15 ఏళ్ల బాలుడు శ్రీ భవాని బ్యాంగిల్స్ అండ్ జనరల్ స్టోర్లో షాప్ కీపర్గా పనిచేస్తుండగా, తండ్రి సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి యజమాని పై కేసు నమోదు చేసి తిరిగి బడికి వెళ్లేలా చూశారు. అదేవిధంగా సోఫీనగర్కు చెందిన16 ఏళ్ల బాలుడు 9వ తరగతి మధ్యలోనే చదువు మానేసి ఇంటి నిర్మాణ పనుల్లో పనిచేస్తుండగా, స్మైల్ బృందం గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించారు. బీరవెల్లి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు తల్లిదండ్రుల బలవంతంతో చదువు మానేసి ఇటుక బట్టీలో పనిచేస్తుండగా, స్మైల్ బృందం గుర్తించి యజమాని పై కేసు నమోదు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి తిరిగి స్కూల్లో చేర్పించారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు గొర్రెలు కాస్తూ చదువు మానేయగా, అతడిని ఆపరేషన్ స్మైల్ బృందం పొంకల్ ప్రభుత్వ పాఠశాలలో తిరిగి చేర్పించారు. నిర్మల్ పట్టణంలోని సనా బట్టల షాపులో పనిచేస్తున్న 16 ఏళ్ల బాలికను రక్షించి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి యజమాని పై కేసు నమోదు చేసి తిరిగి పాఠశాలకుపంపించారు. కుబీర్కు చెందిన 15 ఏళ్ల బాలుడు కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా గ్యారేజీలో మెకానిక్గా పనిచేస్తుండగా, స్మైల్ బృందం గుర్తించి యజమాని పై కేసు నమోదు చేసి తిరిగి స్కూల్లో చేర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నేరమని, పిల్లలను పనుల్లో పెట్టే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల చదువు భవిష్యత్తే సమాజ బాధ్యత అని తెలిపారు. బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 1098 (చైల్డ్ హెల్ప్లైన్) లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు నెల రోజుల వ్యవధిలో ఆపరేషన్ స్మైల్ –XII బృందం మొత్తం 66 మంది పిల్లల జీవితాలల్లో మార్పును తీసుకొని రావడం జరిగింది. జిల్లాలోని రెండు డివిజన్ లలో కలిపి మొత్తం 66 మంది బాలబాలికలను గుర్తించినట్లు తెలిపారు. అందులో 54 మంది పై కేసు నమోదు చేయగా మిగతా వారికి జరిమానా విధించారు.నిర్మల్ డివిజన్ లో 34 మరియు భైంసా సబ్ డివిజన్ లో 32 మంది బాలబాలికలను రెస్క్యూ చేసి తల్లి తండ్రులకు అప్పజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఇందులో 61 మంది బాలురు కాగా ఐదుగురు బాలికలు ఉన్నారు. ఈ ఆపరేషన్ స్మైల్– XII లో, పోలీస్ శాఖ విద్యాశాఖ రెవెన్యూ శాఖ కార్మిక శాఖ బాలల రక్షణ విభాగమ అధికారులు భాగమయ్యారని పేర్కొన్నారు. ఈ అధికారుల అందరి సమన్వయంతో జిల్లాలో ఉన్న కార్మికుల గుర్తించి వాళ్ళని బడిలో చేర్పించేందుకు అందరు కృషి చేశారని పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ ప్రోత్సహిస్తున్న వారిపై కేసు నమోదు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. మళ్ళీ ఎవరైన యజమానులు పిల్లలను పనిలో పెట్టుకుంటే డయల్ 100 లేదా 1098 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ స్మైల్ కి నోడల్ ఆఫీసర్ గా నిర్మల్ జిల్లా అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, డిసిపిఓ మురళి, ఎస్ఐ లు నరేష్, దయాళ్ సింగ్, హనుమాండ్లు,హెడ్ కానిస్టేబుళ్లు పాండు నాయక్, రమేష్, కానిస్టేబుళ్లు రాకేష్, గగన్, చంద్ర శేఖర్, రజిత, లక్ష్మీ, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు, లేబర్ డిపార్ట్మెంట్, ఎన్జీవో సభ్యులు, రెండు డివిజన్ లకు చెందిన ఆపరేషన్ స్మైల్ టీం లు పాల్గొన్నారు.
Admin
E Nivas News