ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, క్రైమ్ వాహనాలు మరియు ప్రాపర్టీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.శనివారం మంచిర్యాల జోన్ పరిధిలోని దండేపల్లి పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. స్టేషన్కు చేరుకున్న అనంతరం పరిసరాలను పరిశీలించిన ఆయన, రిసెప్షన్,ఐటీ విభాగం, ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించారు. అలాగే ఎస్ఐ రాజవర్ధన్ను స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు,ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది సమస్యలను కూడా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. 5S విధానాన్ని అమలు చేస్తూ, పోలీస్ స్టేషన్ను వర్టికల్ వారీగా విభజించి సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. క్రైమ్ వాహనాలు, కేసు ప్రాపర్టీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఎలాంటి పెండింగ్లు ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి, వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
Admin
E Nivas News