ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతుల తోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. బుధవారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వాటిని మర్చిపోయారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ దీనికి బాధ్యులేనని ధ్వజమెత్తారు. రైతులను గోస పెడుతున్న ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండడం కష్టమన్నారు . ఇప్పటికే ప్రజలు విసిగి వేసారి పోతున్నారన్నారు. ఒక విడత రైతు భరోసాను ఎగొట్టి రైతులకు అన్యాయం చేశారన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలను విస్మరించి పాలన చేయడం సబబు కాదని విమర్శలు గుప్పించారు. 10 వేల మంది రైతులతో ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డ్స్ ద్వారా రైతు భరోసా, ఇతర హామీలు నెరవేర్చాలని కోరుతూ పోస్ట్ చేశామన్నారు. అంతేకాకుండా ఎరువుల కోసం గత ప్రభుత్వంలో ఏనాడైన రైతులు ఇబ్బంది పడిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్లు తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కాంతయ్య,మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, సర్పంచ్ ఎల్తపు సుధాకర్, చాంద్, రవి, తిరుపతి, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News