ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పారిశుధ్య నిర్వహణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో పారిశుద్ధ్యం, రోడ్డు విస్తరణ పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రజలకు త్రాగునీరు, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనుల నిర్వహణపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తద్వారా ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయని, వ్యాధుల నియంత్రణలో పరిశుభ్రత కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం హరహదారి విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని, అభివృద్ధి పనుల అనంతరం రహదారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ప్రజలతో మాట్లాడి వార్డులో నెలకొన్న సమస్యల వివరాలు తెలుసుకొని అధికారుల సమన్వయంతో త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం 6వ వార్డులో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాన్ని లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ అంజలి, వైస్ చైర్ పర్సన్ రాజేశ్వరి లతో కలిసి సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు సంబంధించి రైతుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా కేటాయించిన ప్రకారం గోదాములు, రైస్ మిల్లులకు వేగంగా తరలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News