ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ మరియు 15వ వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని, మొత్తం మీద సుమారు 30 వేల కోట్ల రూపాయల అప్పులు చేసినట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేవలం మూడు నియోజకవర్గాల అభివృద్ధికే పరిమితమై, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతినెల సుమారు 5 వేల కోట్ల రూపాయల వరకు అప్పుల మిత్తి చెల్లిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.అలాగే, సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని, ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలాన్ని ప్రస్తావిస్తూ, ఉద్యమ సమయంలో కార్యకర్తలు సొంత డబ్బులతోనే ఉద్యమాలు నిర్వహించారని, అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో సుమారు 900 కోట్ల రూపాయలు ఉన్నాయని ఆరోపించారు. ఆ నిధులపై పూర్తి స్థాయి ఎంక్వైరీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించినట్టు మంత్రి వివేక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల కోసం పారదర్శక పాలన, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News