ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రబంధ సాహిత్యంలో మను చరిత్రకు ఉన్న స్థానం అపూర్వమైనది. మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ కథను మహాకవి అల్లసాని పెద్దన తన వర్ణనా వైభవంతో మహాప్రబంధంగా మలిచారు. కవి ప్రతిభకు, కృతి భర్తగా శ్రీకృష్ణదేవరాయలు ఆశ్రయానికి ఈ కావ్యం అజరామర కీర్తిని తెచ్చింది. ఈ కావ్యం స్వారోచిష మను సంభవాన్ని నేపథ్యంగా తీసుకొని,ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఒక్కటి ప్రవరుడు, రెండు సిద్ధుడు, మూడు వరూధిని ఈ పాత్రలతో కథ నడుస్తుంది. *ప్రవరుడు ఆదర్శ జీవి* ప్రవరుడు ఒక ఆదర్శ గృహస్థుడు. తల్లిదండ్రుల సేవలో తరించేవాడు. నిత్యాగ్నిహోత్ర పరాయణుడు. అతిథి సేవను ధర్మంగా భావించేవాడు. అరుణాస్పద పట్టణాన్ని ఎప్పుడూ విడిచిపెట్టని నియమవంతుడు. తీర్థయాత్రల కథలు, హిమాలయ సౌందర్య వర్ణనలు అతని అంతరంగంలో కోరికగా మారాయి. అదే సమయంలో అతని ధర్మనిష్ఠ అతడిని ఊరు విడిచి వెళ్లకుండా కట్టడి చేసింది. *సిద్ధుని ఆగమనం* ఒకనాడు అతిథిగా వచ్చిన సిద్ధుడు తన యాత్రల విశేషాలు చెబుతాడు. చిన్న వయసులోనే ఇన్ని ప్రదేశాలు ఎలా చూశావని ప్రవరుడు అడిగితే, తన వద్ద ఉన్న దివ్య పసరు మహిమను వివరిస్తాడు. కుతూహలంతో నిండిన ప్రవరుడు ఆ పసరును తనకు ఇవ్వమని కోరతాడు. సిద్ధుడు పసరును అతని పాదాలకు పూసి వెళ్లిపోతాడు. కానీ దాని పరిమితి గురించి చెప్పడు. *హిమాలయ యాత్ర* పసరు ప్రభావంతో ప్రవరుడు హిమాలయాలకు చేరతాడు. ప్రకృతి సౌందర్యంలో పరవశిస్తాడు. కానీ మంచు తాకడంతో పసరు కరిగిపోతుంది. తిరిగి వెళ్లలేని అయోమయ స్థితిలో ఉండగా ఒక లోయలో అపూర్వ సౌందర్యరాశి వరూధిని దర్శనమిస్తుంది. *అంతర్మథనం.....ధర్మ విజయం* వరూధిని, ప్రవరుల సంవాదంలో వరూధిని అప్సరస వంశానికి చెందిన స్త్రీ తన అందంతో, వాక్చాతుర్యంతో ప్రవరుణ్ని మోహింపజేయాలని ప్రయత్నిస్తుంది. "మీ యజ్ఞ యాగాల ఫలితం స్వర్గంలో మా కౌగిళ్లలోనే కదా! ఆ సుఖాన్ని ఇప్పుడే ఎందుకు అనుభవించరు?" అని ప్రలోభపెడుతుంది. కానీ ప్రవరుడు కామశాస్త్రం తెలిసినవాడే. శృంగారాన్ని తిరస్కరించేవాడు కాదు. అయినా ఏకపత్నీ వ్రతానికి కట్టుబడినవాడు, ధర్మం వైపు నిలుస్తాడు. అంతఃసంఘర్షణ ఇది కేవలం బాహ్య సంఘటన కాదు. ఇది మనసులో జరిగే ఘర్షణ కోరిక, వివేకం, భోగం, ధర్మం. వరూధిని అతని అంతశ్చేతనలో దాగి ఉన్న భోగవాంఛకు ప్రతిరూపం. *వివేక విజయం* వరూధిని అతన్ని కౌగిలించుకున్న క్షణమే ప్రవరుడు ఉలిక్కి పడి "హా శ్రీహరీ"! అంటూ ఆమెను దూరం నెట్టివేస్తాడు. తన కోరికలను అగ్నిలో వేసి, యోగాగ్నితో శుద్ధి చేసుకొని, అగ్ని సహాయంతో తన గృహానికి చేరుకుంటాడు. *కావ్య సందేశం* మను చరిత్ర మనకు చెప్పేది ఇదే. కోరికలను గెలవడం కాదు, జయించాలి. ధర్మం తాత్కాలికంగా కాదు, సర్వకాలికం. గృహస్థ ధర్మమే, సమాజానికి మూలస్తంభం. గెలుపు అశాశ్వతం, విజయం శాశ్వతం. అందుకే మను చరిత్ర ఒక కథ కాదు, మనిషి అంతరంగ యాత్ర. --డా.ఓర్సు రాయలింగు 9849446027
Admin
E Nivas News