ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎస్టీల సంక్షేమ కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాద్ అసెంబ్లీ హాలులో నిర్వహించగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఉపాధి, గృహ వసతి, మౌలిక వసతులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించడం సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా సాగింది. సమావేశంలో గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలించడంతో పాటు, అర్హులైన ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా అనే అంశంపై చర్చించారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. అలాగే గిరిజన గ్రామాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బోథ్ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల సమస్యలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. గిరిజనులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఎస్టీల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలోచర్చించారు. గిరిజనుల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి శాసనసభ కమిటీ ద్వారా అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ మంత్రి శ్రీధర్ బాబు గారు తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News