ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య తెలిపారు . శుక్రవారం మంచిర్యాలజిల్లాలోని హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలలోని పలు వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. హాజీపూర్ మండలంలో రహదారిపై రైతులు నిర్వహిస్తున్న రాస్తారోకో వద్దకు చేరుకుని, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారంపై హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వెంటనే ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు హాజీపూర్ మండలంలోని పడ్తన్పల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి టార్పాలిన్ల కొరతపై రైతులు చేసిన ఫిర్యాదులను మార్కెటింగ్ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, మిల్లర్లతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కర్ణమామిడి వరి కొనుగోలు కేంద్రాన్ని మండల పంచాయతీ అధికారి, సర్పంచ్, ఇతర అధికారులతో కలిసి సందర్శించి కేంద్రంలో కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పూర్తిగా పాటించాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు.అవసరానికి అనుగుణంగా లారీలను సమకూర్చాలని రవాణా కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల హమాలీలను సమానంగా కేటాయించి, వరి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. హాజీపూర్ మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, లారీల కేటాయింపులో రవాణా కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే 5 లారీలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని మిట్టపల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, వరి సంచుల లోడింగ్ పనులపై నిర్వాహకులతో సమీక్షించి కొనుగోలు, లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వెంకట్రావుపేట వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, నిల్వ సమస్యపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న సుమారు 1 వేయి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల పీఏసీఎస్ గోదాంను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలం తహసీల్దార్ దిలీప్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
E Nivas News