ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్లో హోరాహోరీగా నిర్వహించబడిన క్రీడోత్సవాలు రెండు రోజుల క్రితం ముగిశాయి. ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను సోమవారం సిపి అభినందించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై, పతకాలు సాధించిన క్రీడాకారులను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచినందుకు క్రీడాకారులను అభినందించారు. క్రీడలకు సమయం కేటాయించే పోలీస్ అధికారులకు పూర్తి స్థాయి సహకారం అందించబడుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించి శాఖకు మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో విజయం సాధించడం క్రమశిక్షణ, సమన్వయం, నిరంతర సాధన వల్లే సాధ్యమని పేర్కొంటూ, శాఖ తరఫున క్రీడాకారులకు అన్ని విధాల మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని, విధి నిర్వహణలో క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమని తెలిపారు. 4వ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ మీట్-2026లో కాలేశ్వరం జోన్ నుండి 150 మంది పాల్గొనగా, అందులో 30 మంది క్రీడాకారులు 23 పతకాలు సాధించారు. అందులో బంగారు పతకాలు 7, వెండి పతకాలు 8, కాంస్య పతకాలు 8 ఉన్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్కు చెందిన 15 మంది క్రీడాకారులు, ములుగు జిల్లా నుండి 5 మంది, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుండి 6 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి 4 మంది పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ కృష్ణ, ఆర్ఐలు శేఖర్, పెద్దన్న, సీసీ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News