ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గ్రామాల్లో ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారీ మరియు విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కోటపల్లి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో సోమవారం విశ్వసనీయ సమాచారం మేరకు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ అర్జునగుట్ట గ్రామంలోని పలు అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మొత్తం 35 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబాను స్వాధీనంచేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 300 లీటర్ల బెల్లపు పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేసి తయారీ సామగ్రిని కూడా సీజ్ చేశారు. నిందితులైన ఆకుదారి అనిల్ 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోగా 300 లీటర్ల బెల్లపు పానకం ధ్వంసం చేశామన్నారు. అలాగే అట్టేలా మల్లయ్య వద్ద 15 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆకుదారి సదువలి వద్ద10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన ముగ్గురిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ, గ్రామాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుడుంబా కారణంగా అనేక కుటుంబాలు ఆర్థిక, ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇలాంటి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు,టీజీఎస్పీ కానిస్టేబుళ్లు మల్లేష్, సాయికృష్ణ, నరేష్ పాల్గొన్నారు.
Admin
E Nivas News