ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ.. నగరంలోని సీవీఆర్ బాలికల నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ అటవీ, ఎండోమెంట్ శాఖలకు సంబంధించి వివిధ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తోందని, ఇవి ఈ నెల 13వ తేదీ వరకు జరుగుతాయన్నారు. విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని 15 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని.. సీటింగ్ అరేంజ్మెంట్, ఫర్నిచర్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా ఇలా వివిధ అంశాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. లైజనింగ్, చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు సమన్వయ శాఖల అధికారులు సమష్టి కృషితో పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు ఆదేశాలిచ్చామని, ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, పూర్తి భద్రత మధ్య పరీక్షలు రాసేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ సమాచారం డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.
Admin
E Nivas News