ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలానికి చెందిన మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీమ్ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారిక సహాయం చేయడానికి ఫిర్యాదుదారుడి నుండి రూ.20,000 లంచం డిమాండ్ చేస్తూ, అదే మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు వలపోసి పట్టుకున్నారు. సర్వే నెంబర్ 225/6 కు సంబంధించిన 1.15 గుంటల భూమి వివరాలు ఆన్లైన్ 1-బి రిజిస్టర్ (ఆర్ఓఆర్) నుండి తొలగించబడగా, వాటిని పునరుద్ధరించేందుకు ఫిర్యాదుదారుడు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును సంబంధిత ఫైల్తో కలిసి తహశీల్దార్కు ప్రాసెస్ చేసి పంపేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుబడిన అధికారిపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని కోరారు.
Admin
E Nivas News