ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భువనగిరి జిల్ల ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి శనివారం అత్యంత వైభవంగా భూమిపూజ నిర్వహించారు. శంకర విజయేంద్ర సరస్వతి స్వామి దివ్య సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ఎ. రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు.తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయాన్ని రూ.43.80 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్య అందించేందుకు ఈ పాఠశాల రూపొందించబడుతోంది. ఇందులో హోమాలు, యాగాలు నిర్వహించేందుకు ప్రత్యేక శాలలు, గోశాల కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో భక్తుల సౌకర్యార్థం పలు కీలక నిర్మాణాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణం, కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ.9.87 కోట్లతో భారీ కల్యాణ మండపం, వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి రూ.1.41 కోట్లతో రక్షణ పైకప్పు (కానోపీ), రథశాల వైపు మాడవీధులకు అనుసంధానంగా రూ.1.35 కోట్లతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News