ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు-నాగమని దంపతుల హత్యకేసులో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తమను ప్రోత్సహిస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించడం నిజం కాదని వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు అన్నారు. మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన మాట్లాడుతూ నేను గత 30 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానని, నాకు న్యాయ వ్యవస్థ పై పూర్తి అవగాహన ఉందని, తన కొడుకు, కోడలును హత్య చేసిన నిందితులను న్యాయపరంగా శిక్షించాలని, వృద్ధ వయసులో తాను తన కుటుంబ సభ్యులతో కలిసి నిందితులకు శిక్ష పడాలని మొదటి నుంచి పోరాడుతున్నానని, న్యాయం వ్యవస్థ పై తమకు నమ్మకం ఉంది కాబట్టే హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లి తమ లాయర్లు మేనక గురుస్వామి, భరత్ కుమార్, చంద్రకాంత్ రెడ్డిల సహకారంతో ఈ కేసును సుప్రీం కోర్టు లో వాదించడంతో సుప్రీం కోర్టు సిబిఐ కి అప్పగించిందని, ఈ కేసులో నాకు ఏం తెలవదని శ్రీధర్ బాబు అండదండలతో నేను సుప్రీంకోర్టుకు వెళ్లాలని పుట్ట మధు ఆరోపించడం శ్రీధర్ బాబు పై బురద చల్లడమేనన్నారు. ఈ కేసుతో పుట్ట మధుకు, ఆయన భార్యకు, సంబంధం లేదని ఆరోపిస్తున్నారని, పుట్ట మధుకు ఈ హత్యతో సంబంధం లేకుంటే తమ కుటుంబాన్ని ఒక్కసారైనా పుట్ట మధు వచ్చి పరామర్శించారా.. అని వామన్ రావు తమ్ముడు చంద్రశేఖర్ ప్రశ్నించారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు వద్ద పుట్ట మధు తన తండ్రి కలిసి ఉండేవారన్నారు. ఇకమీదట ఈ కేసులో సంబంధం లేని వారిని విమర్శిస్తే న్యాయపరంగా పోరాడుతామన్నారు. న్యాయ వ్యవస్థ పై తమ కుటుంబానికి నమ్మకం ఉందని తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా, తన కొడుకును, కోడలును పట్టపగలు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన నిందితులకు సుప్రీంకోర్టులో శిక్ష పడే వరకు ఇలాగే పోరాడుతామని వారు తెలిపారు.
Admin
E Nivas News