ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అమృత్ 2.0 పథకం క్రింద జి.ఐ.ఎస్. ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని,ఇందు కొరకు అవసరమైన వివరాలను సంబంధిత శాఖల అధికారులు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డి.టి.సి.పి. సంయుక్త సంచాలకులు, అమృత్ 2.0 నోడల్ అధికారి అశ్విని, మంచిర్యాల డి.టి.సి.పి.ఓ. సంపత్ లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో మాస్టర్ ప్లాన్ రూపకల్పన అంశంపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, మందమర్రి మున్సిపల్ అధికారులకు మొదటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జి ఐ ఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. నగరం ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడానికి, 20 సంవత్సరాల వరకు భవిష్యత్తు అవసరాలు అంచనా వేయడానికి ప్రాదేశిక వివరాలను సేకరించాలని తెలిపారు. డిజిటల్ మ్యాపింగ్ లో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి భూ వినియోగ మ్యాప్లు రూపొందించవచ్చని, నూతన డేటాను ప్రతిబింబించేలా జి ఐ ఎస్ ఆధారిత ప్లాన్లను నవీకరించవచ్చని, తద్వారా అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. సమగ్ర ప్రణాళిక ద్వారా భవిష్యత్తు అభివృద్ధికి భూ వినియోగం, భవన నిర్మాణం, రవాణా, వివిధ రంగాల అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. 2051 సంవత్సరం నాటికి జనాభా మరింత పెరిగే అవకాశం ఉందని, తరగతుల వారీగా జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన ఇండ్లు,త్రాగునీరు, రహదారులు,ఇతర ప్రజాసేవలు ప్రణాళికాబద్ధంగా అందించేందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు. ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా, ఉద్యానవనాలు, పచ్చదనం అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 37.67 కిలోమీటర్ల ఏరియాలో,మందమర్రి మున్సిపల్ పరిధిలో 38.98 కిలోమీటర్ల ఏరియాలో డ్రోన్, సోషియో ఎకనామిక్ సర్వే పూర్తి చేయడం జరిగిందని, ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయి సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ కార్యకలాపాల సమయంలో అవసరమైన మద్దతును అందించాలని, సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని,కార్యక్రమ నిర్వహణ కొరకు టిపిబివోలు, వార్డు ఆఫీసర్ లను సహాయకులుగా నియమించి బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు.సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో మున్సిపాలిటీలో పబ్లిక్ నోటీస్ జారీ చేయాలని, సర్వే కార్యకలాపాల సమయంలో కన్సల్టెంట్ లకు అవసరమైన సహాయం అందించాలని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో రూపొందించే జి ఐ ఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సమర్థవంతంగా తయారు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News