ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : 2025- 26 సంవత్సరానికి గాను వరి ధాన్యం కొనుగోలు కొరకు జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతు సంక్షేమం కోసం చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా రైతుల సౌకర్యం కొరకు కంట్రోల్ రూమ్ నం.6303928682 ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రస్థాయిలో 1967, 1800 4250 0333 నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులకు అవసరమైన కొనుగోలు కేంద్రాల సమాచారం అందించడంతో పాటు, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై రైతులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి క్వింటాలుకు 2 వేల 369 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలు, తేమ యంత్రాలు ఇతర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News