ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం కల్పిస్తున్నఅవకాశాలను విద్యార్థులుసద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు .బుధవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ద్వారక గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న షెడ్యూల్డ్ తెగల బాలుర వసతి గృహ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్య బోధన అందిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో చేపట్టిన వసతి గృహ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసేలా అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గ్రామంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించి ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని బూత్ స్థాయి అధికారులకు సూచించారు.మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదులు, మూత్రశాలల పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వంటశాలను పరిశీలించి కారం తయారీ సమయంలో శుభ్రత నిబంధనలు పాటించాలని సిబ్బందికి సూచించారు.ప్రభుత్వ పాఠశాలలలో కల్పిస్తున్న సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు.లక్షెట్టిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి నిర్మాణంలో ఉన్న భోజనశాల, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకుసూచించారు. వంటశాలను సందర్శించి విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని, ఆహారం తయారీకి తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులను వినియోగించాలని సూచించారు.అనంతరం లక్షెట్టిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల పరిధిలోని గ్రామపంచాయతీల కార్యదర్శులు, బూత్ స్థాయి అధికారులు, వాలంటీర్లకు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, లక్షెట్టిపేట మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా తయారీలో ముసాయిదా జాబితా రూపకల్పన ముఖ్యమని తెలిపారు. ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించే విధంగా ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. సమగ్ర సవరణ ప్రక్రియలు భాగంగా 2002 సంవత్సరంలో ఓటు హక్కు కలిగిన వారి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తూ ప్రస్తుత సవరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 72 శాతం అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. నూతన ఓటరు నమోదు కొరకు ఫారం 6 తో పాటు డిక్లరేషన్ తీసుకుని ఓటు నమోదు చేయవచ్చని, ఓటు తొలగింపు, 2 అంతకంటే ఎక్కువ ఎపిక్ కార్డులు కలిగిన వారు ఒకే కార్డు ఉండేలా చూడాలని తెలిపారు. ఆన్లైన్ లో సైతం ఎన్యుమరేషన్ ఫారం నింపవచ్చని తెలిపారు.
ఓటర్లకు అందించిన ఎన్యుమరేషన్ ఫారం నింపేందుకు బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత, చదువుకున్న వారు సహాయం అందించాలని, ఒకరు ఒక ఓటరు గుర్తింపు కార్డు మాత్రమే కలిగి ఉండేలా క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేయాలని తెలిపారు. మరణించిన,గ్రామం వదిలి వెళ్ళిన,2 మించి ఓటరు కార్డులు కలిగిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలు నింపిన తరువాత సేకరించి బి ఎల్ ఓ యాప్ లో డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని,నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారులు, జి.పి.ఓ. లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News