ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు విడుదలగా జరిగిన సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11,14, 17తో చిదురు ముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మొదటి విడత ఎన్నికల నాటినుండి ఇటు జిల్లా అధికార యంత్రాంగం అటుపోలీసు యంత్రాంగం సైతం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎన్నికలు నిర్వహించారు. మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ తన బలాన్ని చూపెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా రెండవ స్థానంలో బారాస పార్టీ కూడా మేమున్నామని ఉనికిని చాటి చెప్పింది. మూడవ స్థానంలో భాజాపా కూడ చాప కింద నీరులా రంగ ప్రవేశం చేసింది. గత నెల రోజులుగా ఎముకల కొరకే చలి ఉన్నా పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ప్రచార పర్వాన్ని వారిదైన శైలిలో నిర్వహించి ఓటర్లను తమ వైపు తిప్పుకొని ఓట్లను వేయించుకోవడంలో సఫలమయ్యారని పలువురు చర్చించుకుంటున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పంపిణీ మాత్రం ఆగిన దాఖలాలు లేవని బహిరంగంగానె చర్చించుకుంటున్నారు. కొంత మంది పోటీలో ఉన్న అభ్యర్థులు మహిళల ఓట్లను వేయించుకునే ఉద్దేశంతో వారికీ చీరలు సిల్వర్ కాయిన్ లు కూడా పంపిణీ చేసినట్లు సమాచారం ఉంది. ఇంత డబ్బు ఖర్చు పెట్టి గెలిచిన అభ్యర్థులు రేపు గ్రామాలను ఏం అభివృద్ధి చేస్తారని చర్చ మరోవైపు వినిపిస్తోంది. డబ్బులకు ఎప్పుడైతే ఓటర్లు అమ్ముడుపోతారో అప్పటివరకు గ్రామాల అభివృద్ధి కాదు కదా దేశం కూడా అభివృద్ధి చెందదనే పలువురు మేధావులు అంటున్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసిన గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే పరిపాలనలో ఉందో అదే పార్టీకి ఓటర్లు ఓట్లు వేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఊహించినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల షెడ్యూలు త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించడంతో మళ్లీ రంగంలో ఉండే అభ్యర్థులు వనరులను సమకూర్చుకుంటున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ లో గెలిచిన అభ్యర్థులకు పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు సన్మానాలు చేస్తుండడంతో, భారాస పార్టీ నాయకులూ కూడా వారి అభ్యర్థులలో ఉత్సాహాన్ని నింపడానికి ఘనంగా సన్మానాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల మాత్రం కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు. ఏది ఏమైనా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఎటువైపు వెళ్తుందో తెలియదు కానీ ఓటర్లకు పండగ వాతావరణం నెలకొంది అనడంలో సందేహం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Admin
E Nivas News