ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని షెడ్యూల్ కులమునకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక పురోగతి పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా రంగం ఎలక్ట్రికల్ లో ఈ.వి. 2 వీలర్ ను 90 శాతం రాయితీ, 10 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 1 లక్ష రూపాయలతో 180 యూనిట్లు, ఈ. వి. త్రిచక్ర వాహనం (సరుకు రవాణా,ప్రయాణికుల రవాణా) ను 70 శాతం రాయితీ, 30 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 3 లక్షల రూపాయలతో 89 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ పథకాలలో సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ భాగం ను 100 శాతం కార్పొరేషన్ రాయితీ కల్పించి సగటు యూనిట్ ధర 3 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయల వరకు 19 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. పశు సంవర్ధక పథకాలలో 70 శాతం కార్పొరేషన్ రాయితీ, 30 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 2 లక్షల 40 వేల రూపాయలతో 96 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ కార్యక్రమాలలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ, టామ్ కామ్, ప్రధానమంత్రి అజయ్ పథకాల క్రింద జాతీయస్థాయి శిక్షణ సంస్థల ద్వారా వేతన ఉపాధి కొరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు/ఆహార భద్రత కార్డు, కుల ధ్రువీకరణ పత్రం (తెలంగాణ ఏర్పడిన తర్వాత), ఆదాయ ధ్రువీకరణ పత్రం (మీ సేవ ద్వారా జారీ, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయలకు లోబడి), వ్యవసాయేతర పథకాలకు అభ్యర్థుల వయసు 21-50 సం.లు, వ్యవసాయ పథకాలకు 21-60 సం.లు ఉండాలని తెలిపారు. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగ పథకాలకు), షెడ్యూల్డ్ కులాల పారిశ్రామికవేత్తలు,గిగ్ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, పట్టాదారు పాసు పుస్తకం (సోలార్ పంపు సెట్ కోసం కనీసం 2 ఎకరాల భూమి అవసరం), బోరు బావి, నీటి లభ్యతను నిర్ధారిస్తూ గ్రామ కార్యదర్శి నుండి ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, సదరం సర్టిఫికెట్ (దివ్యాంగుల కొరకు), పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలని తెలిపారు. పాడి పశువుల పథకం కొరకు పశుగ్రాసం పెంచడానికి కనీసం 10 గుంటల సాగునీటి సౌకర్యం ఉన్న సొంత/కౌలు భూమి కలిగిన షెడ్యూల్డ్ కులములలబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ లోగా ఓబి ఎంఎంఎస్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకొని సరైన ధ్రువపత్రాలు జత చేసి సంబంధిత మండలం/మున్సిపాలిటీ కార్యాలయాలలో సమర్పించాలని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Admin
E Nivas News