ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రజల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువలో మెరుగైన వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వైద్య సేవలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా చేపట్టిన ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, గుత్తేదారుల సమన్వయంతో పనులను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు పనులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు, అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను సందర్శించి పనులు త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా గుత్తేదారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. మండల కేంద్రంలో చేపట్టిన అమృత్ 2.0 నిర్మాణ పనులను పరిశీలించి ప్రతి నివాసానికి నిరంతరాయంగా త్రాగునీటిని అందించేందుకు చేపట్టిన నీటి ట్యాంకు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News