ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఆసిఫాబాద్ : రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని వెంకటేశ్వర కాటన్ మిల్లు లో సి సి ఐ ద్వారా చేపట్టిన పత్తి కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా మార్కెటింగ్ అధికారి షహబుద్దీన్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ఇందులో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎకరానికి 14 నుండి 16 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వ నిబంధనలలో పేర్కొన్న 7 క్వింటాళ్ల అంశాన్ని సడలించి రైతులు ముందుగా నమోదు చేసుకున్న ప్రకారంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సి.ఎం.డి. తో మాట్లాడి ఎల్ 1, ఎల్2, ఎల్3 అంశాలకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో కేటాయించిన 10 కొనుగోలు కేంద్రాలలో 6 కేంద్రాలు ప్రారంభించబడి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, రైతుల సౌకర్యార్థం కపాస్ కిసాన్ యాప్ ద్వారా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతులు దళారీలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సి సి ఐ కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలనితెలిపారు. సంవత్సరం క్వింటాల్ పత్తికి 8 వేల 110 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా అవాస్తవ ప్రచారాన్ని మానుకొని రైతు సంక్షేమం కోసం కలిసి రావాలన్నారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా 7 క్వింటాళ్ల అంశాన్ని పరిశీలించి రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేసే దిశగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అధిక దిగుబడి సాధించిన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసి ధ్రువీకరించుకోవాలని, పంట ఉత్పత్తి ఆధారంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో చెన్నూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లి ప్రాంతాలలో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, జైపూర్ ప్రాంతంలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతులకు లబ్ధి చేకూరేలా పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుందని, కౌలు రైతులు తమ పట్టాదారుల సమన్వయంతో వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. పంట సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ధృవపత్రాలు జారీ చేసే సమయంలో అధికారులు జాగ్రత్త వహించాలని, వివరాలు సక్రమంగా ఉన్నట్లయితే టి ఆర్ జారీచేసి పత్తి కొనుగోలు చేయాలని తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయానికి కొనుగోలు కేంద్రాలకు నిబంధనల ప్రకారం నాణ్యమైన పత్తిని తీసుకువచ్చే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.అనంతరం ఎంపీ అనుచరుడు దమ్మ సునీల్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. అంతకుముందు హన్మంతు పల్లి, చందారం కు బస్ సౌకర్యం కల్పించడం లేదని వెంటనే చర్యలు తీసుకోవాలని నాయకుడు మల్లేష్ కలెక్టర్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూల కిషన్ గౌడ్, మల్లేష్, దొంత నర్సయ్య, మినుముల శాంతి కుమార్, నారాయణ, కొనుగోలు కేంద్రం నిర్వహకులు, పాల్గొన్నారు.
Admin
E Nivas News