ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ విద్యార్థులకు తీపి కబురు అందింది. ఉన్నత విద్యావకాశాలు విస్తరించే దిశగా చారిత్రక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధుల కింద రూ.10 కోట్ల వ్యయంతో ధర్మపురిలో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ముందుకొచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు సాకారం కానుంది. మంత్రి కృషి ఫలితంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హెచ్ఏఎల్ ప్రతినిధులు, జగిత్యాల జిల్లా యంత్రాంగం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓ యు) కుదిరింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, హెచ్ఏఎల్ హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎ.వి. మురళీకృష్ణ, డీజీఎం (హెచ్ఆర్) సూర్యకాంత్ రౌత్, సీనియర్ మేనేజర్ (హెచ్ఆర్) ఎస్. సత్యనారాయణ సమక్షంలో అధికారులు ఎంఓయు పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, "ధర్మపురి ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన విద్య అందించేందుకు ఈ కళాశాల భవనం ఎంతో ఉపయోగపడుతుంది. హెచ్ ఏఎల్ సంస్థ సహకారానికి కృతజ్ఞతలు" అని తెలిపారు. రూ.10 కోట్లతో నిర్మించనున్న ఈ నూతన భవనంలో ఆధునిక తరగతి గదులు, ల్యాబ్లు, లైబ్రరీ వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. దీంతో ధర్మపురి, చుట్టుపక్కల మండలాల విద్యార్థులకు డిగ్రీ విద్య మరింత సులభతరం కానుంది. స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాలు మంత్రి కృషిని అభినందించారు.
Admin
E Nivas News