ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల, వేంపల్లి ప్రాంతంలోని ఎస్. ఆర్. ఆర్. కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి ఇంటర్మీడియట్ పరీక్షల పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుండి మార్చి 16వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణ కొరకు జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రథమ సంవత్సరంలో జనరల్ 5 వేల 372 మంది, ఒకేషనల్ 888 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ 5 వేల 227 మంది, ఒకేషనల్ 830 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించాలని, పరీక్ష సమయంలో 163 బి. ఎన్. ఎస్. ఎస్. సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష సమయానికి అనుకూలంగా టి.జి.ఎస్.ఆర్.టి.సి. అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షించాలని, ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, ప్రశ్నా, జవాబు పత్రాల సురక్షిత రవాణా కొరకు తపాలా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో పారిశుద్ధ్యం నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య, హాజీపూర్ మండల తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News