ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2026-27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకం క్రింద 1, 5 తరగతులలో ప్రవేశం కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని మంచిర్యాలజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారంఒక ప్రకటనలో తెలిపారు. నాన్ రెసిడెన్షియల్ లో 1వ తరగతికి 91 సీట్లు, రెసిడెన్షియల్ లో 5వ తరగతికి 92 సీట్లు కేటాయించడం జరిగిందని, షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ నుండి జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని రూమ్ నం.3 లోని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అందించాలని, దరఖాస్తు ఫారములు కార్యాలయ పని వేళలను పొందవచ్చని తెలిపారు. కుటుంబంలో ఒక అభ్యర్థికి మాత్రమే పథకం వర్తిస్తుందని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయల లోపు ఉండాలని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు జనన ధ్రువీకరణ పత్రం (మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ బోర్డ్, మీ సేవ ద్వారా జారీ చేయబడినది), 1వ తరగతి విద్యార్థులు జూన్ 1, 2020 నుండి మే 31, 2021 మధ్య, 5వ తరగతి విద్యార్థులు 4వ తరగతి బోనఫైడ్, రేషన్ కార్డు,ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమర్పించాలని, మీ సేవ ద్వారా జారీ చేయబడిన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, 3 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు, పాఠశాల నుండి గత సంవత్సరం మార్కుల జాబితా నకలు ప్రతులు (5వ తరగతి వారికి), అన్ని నకలు ప్రతులపై గెజిటెడ్ అధికారి చే ధ్రువీకరణ సంతకం చేయించి సకాలంలో సమర్పించాలని తెలిపారు. జిల్లాలోని షెడ్యూల్డ్ కులముల అభ్యర్థులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Admin
E Nivas News