ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ - 2026లో మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలో ఓటర్లకు జారీచేసిననోటీసులకు సంబంధించి ఓటర్లు అందిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ లతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో నోటీసుల జారీ, విచారణ ప్రక్రియలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రక్రియ నిర్వహించాలని, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో ఓటర్లకు అవగాహన కల్పించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిట్టపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. విద్యారంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఈ క్రమంలో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించాలని, మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలనువిద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు. ఆసరా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి మండల పరిషత్ అభివృద్ధి అధికారి లాగిన్ నుండి ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆహారం నాణ్యతను పరిశీలించారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదులు, భోజనశాల పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందిస్తూ నాణ్యమైన విద్యాబోధన అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News