ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పెద్దపల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, మంథనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రామగుండం లోని సరస్వతి శిశు మందిర్ లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అర్బన్ లోకల్ బాడీస్ కు రెండవ సాధారణ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరుగుతున్నాయని, మన జిల్లాలోని పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సంబంధిత మున్సిపాలిటీలలో ఏర్పాటు చేశామని, ప్రతి చోట పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకొని పోలింగ్ సామాగ్రిని ప్రశాంతంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. రామగుండంలో ఏకగ్రీవమైన ఒక డివిజన్ మినహాయించి జిల్లాలోని మిగిలిన 123 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయని, సుమారు 470 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం నందు వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నామన్నారు.
క్రిటికల్ పోలింగ్ కేంద్రాల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది అవసరమైన సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీ, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, రమేష్, మనోహర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News