ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం నుండి అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సిద్దిపేట జిల్లా, నిర్మల్ జిల్లాల్లో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లగా, విద్యుత్ సరఫరాకి కూడా అంతరాయం కలిగింది. కాళేశ్వరంలో వడగళ్ల వాన బీభత్సం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాంతంలో వడగళ్ల వాన తీవ్రంగా కురిసింది. భారీ గాలులు, వడగళ్ల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపడటంతో స్థానికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ వడగళ్ల వాన కారణంగా ముఖ్యంగా మిర్చి, పత్తి, ఇతర వాణిజ్య పంటలకు భారీ నష్టం వాటిళ్లింది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు ఒక్కసారిగా నష్టపోవడంతో ఆందోళన చెందుతున్నారు. *సిద్దిపేట జిల్లాలో.. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు చెట్లు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అలాగే సిద్దిపేట, దుబ్బాక పట్టణాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో పలు రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. *నిర్మల్ జిల్లాలో.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం వంటి సమస్యలు తలెత్తాయి. *ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈవర్షాలతోతెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే ఎండ తీవ్రత పెరుగుతండగా ఒక్కసారిగా వడగళ్ల వాన, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. అయితే రైతులకు మాత్రం తీవ్ర నష్టం కలిగింది. *రైతులకు భారీ నష్టం.. వడగళ్ల వాన కారణంగా ముఖ్యంగా మిర్చి, పత్తి, కూరగాయల పంటలు, ఇతర వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగళ్ల వర్షంతో పంటలు నేలకూలిపోయాయి. అలాగే మరోవైపు ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు. *అధికారుల అప్రమత్తత.. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. నష్టాలను అంచనా వేయడానికి సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపడుతున్నారు. రైతులకు నష్టం జరిగిన ప్రాంతాల్లో నివేదికలు సేకరిస్తున్నారు.
Admin
E Nivas News