ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జపాన్లో పర్యటించి గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు మరియు మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకుని మంత్రి వివేక్ వెంకటస్వామి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించడంతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలకు వారిని సిద్ధం చేయాలనే లక్ష్యంతో మంత్రి వివేక్ వెంకటస్వామి చేపట్టిన జపాన్ పర్యటన ఎంతో ప్రాధాన్యత కలిగినదని అన్నారు.జపాన్లో అమలవుతున్న ఆధునిక సాంకేతిక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి విధానాలు, పరిశ్రమలకు అనుగుణంగా యువతకు అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను అధ్యయనం చేయడం ద్వారా వాటిని తెలంగాణలోనూ అనుసంధానం చేసే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. తెలంగాణ యువతలో ప్రతిభ, సామర్థ్యానికి కొదవ లేదని, వారికి సరైన నైపుణ్యం, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, అవకాశాలు అందిస్తే ప్రపంచ స్థాయిలో పోటీ పడి రాణించగలరని అన్నారు. యువతను కేవలం స్థానిక ఉపాధి అవకాశాలకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని నైపుణ్యాభివృద్ధి విధానాలను అధ్యయనం చేసి తెలంగాణ యువతకు అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రి వివేక్ వెంకటస్వామి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలోని యువతకు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి, అంతర్జాతీయ అవకాశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, మాజీ జెడ్పిటిసి యాకూబ్ అలీ, మాజీ కౌన్సిలర్ పనాస రాజు, జిల్లా కార్యదర్శి గోపతి బానేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి గోపు రాజం, బత్తుల వేణు, నాయకులు బొడ్డుల ప్రేమ్ సాగర్, నక్క శ్రీనివాస్, కుమ్మరి సాయితేజ, కుర్మ సురేందర్, అందుగుల మల్లేష్, కనకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News