ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్రంలో అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యదేవుని ఆలయం లో కార్తీక పౌర్ణమి రోజైన బుధవారం భక్తులు కార్తీక పౌర్ణమి జాతరను కన్నుల పండవగా జరుపుకున్నారు. వేలాదిమంది భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం అంతా భక్తజన సందోహంతో క్రిక్కిరిసిపోయింది. ఉదయం నుండి భక్తులు తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుండి కూడా వేలాదిమందిగా తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కాలినడకన ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. సామూహిక సత్యనారాయణ వ్రత మండపంలో సుమారు 1300 జంటలు సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. ఒకేసారి వేలాదిమందిగా భక్తులు తరలిరావడంతో వచ్చిన వారందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎండ బారిన పడకుండా షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరును అందుబాటులో ఉంచారు. పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో వాలంటీర్లు వచ్చిన భక్తులకు సేవలు అందించారు. గోదావరి వద్ద స్నానాలు ఆచరించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి భద్రత చేపట్టారు. భక్తులు సత్యదేవుని దర్శించుకున్న అనంతరం సమీపాన్ని గల అభినవ శబరిమల అయ్యప్ప ఆలయంతో పాటు సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఎదుట గల రావి చెట్టు వద్ద మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుతో పాటు డీసీపీ భాస్కర్ ఎసిపి ప్రకాష్ లు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వీరిని సాంప్రదాయ రీతిలో ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి చిత్రపటాలతో అందజేసి శాలువాలతో సత్కరించారు. ట్రాఫిక్ కు ఎలాంటి సమస్య తలెత్తకుండా సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం ఎస్సైలు గోపతి సురేష్, తహసీనుద్దీన్, అనూష, పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Admin
E Nivas News