ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని విద్యార్థుల అభ్యాస స్థాయిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖాధికారిణి శారద, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డా. పి. ఎం. షేక్ లు సూచించారు. మంథని మండలంలోని ఎం.పి.పి.ఎస్. గౌతమీనగర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యా కార్యక్రమాల అమలును పరిశీలించారు. మొదటగా ఎం.పి.పి.ఎస్. గౌతమీనగర్ పాఠశాలలో FLN (Foundational Literacy & Numeracy) అమలు, బోధన-అభ్యసన ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులకు స్పాట్ అసెస్మెంట్ నిర్వహించి వారి అభ్యాస స్థాయిని అంచనా వేశారు. అలాగే ప్రీ-ప్రైమరీ విభాగాన్ని సందర్శించి చిన్నారుల అభ్యాస కార్యకలాపాలను పరిశీలించారు. FLN లక్ష్యాల సాధనకు అవసరమైన పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మంథనిలో Learning Improvement Programme (LIP) అమలు తీరును పరిశీలించి విద్యార్థులకు స్పాట్ అసెస్మెంట్ నిర్వహించి అభ్యాస ఫలితాలను సమీక్షించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి అభ్యాస పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించి విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల అభ్యాస ఫలితాల పెంపు, LIP సమర్థవంతమైన అమలు, తరగతి గది బోధనలో నాణ్యత పెంపు, నిరంతర మూల్యాంకనం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి విలువైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంథని మండల విద్యాధికారి శ్రీమతి లక్ష్మి, CRP లు పాల్గొన్నారు.
Admin
E Nivas News