ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును జైనథ్ పోలీసులు రెండు గంటల్లోనే చేదించి, దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను 100 శాతం తిరిగి స్వాధీనం చేసినట్లుఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం.. సాత్నాల మండలం కెనాల్ మేడిగూడ గ్రామానికి చెందిన నిందితుడు గుమ్మడి రవీందర్ (32) కూలి పని చేస్తూ మద్యానికి బానిసై ఖర్చుల కోసం డబ్బులు అవసరమై అదే గ్రామంలో నివసించే బరపటి వెంకటి ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో నిందితుడు ఇంటిలోకి చొరబడి బీరువా తాళం తీసి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగలించి తన ఇంటి వద్ద మట్టిలోదాచిపెట్టాడు. దొంగతనం విషయం వెలుగులోకి రావడంతో వెంటనే జైనథ్ పోలీస్ స్టేషన్ నందు 34/2026 అండర్ సెక్షన్ 331(3),305 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి, వెంటనే రంగంలోకి దిగిన జైనథ్ పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. అనంతరం అతని ఇంటి సమీపంలో మట్టిలో దాచిన ఆభరణాల డబ్బాను వెలికితీసి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు సుమారు 3½ తులాలు, వెండి ఆభరణాలు సుమారు 50 తులాలు, రాగి వస్తువులు సుమారు 8 తులాలు, మొత్తం దొంగలించిన వస్తువులు విలువ రూ 5,04,500 దొంగతనం కేసును రెండు గంటల్లోనే చేదించి, దొంగిలించిన ఆస్తిని 100 శాతం రికవరీ చేసిన జైనథ్ పోలీసుల పనితీరును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ప్రజల భద్రత కోసం ఇదే విధంగా అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్లలో విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ఈ కేసును చేదించడంలో కీలకపాత్ర పోషించిన జైనథ్ సిఐ జి శ్రావణ్ ను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Admin
E Nivas News