ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కులాల అమావాస్య వేడుకలను గురువారం రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ పట్టణంలో ‘ఏడ్ల పోలాల అమావాస్య’ వేడుకలను రైతులు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిర్వహించారు. తమకు వ్యవసాయంలో తోడుగా, అండగా నిలిచే ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా దస్నాపూర్ రైతులు తమ ఎద్దులను రంగురంగుల వస్త్రాలు, పూలమాలలతో అందంగా తీర్చిదిద్ది డప్పు వాయిద్యాలు, మంగళ హారతుల నడుమ పట్టణంలో కోలాహలంగా ఊరేగించారు. అనంతరం స్థానిక అంకమ్మ రాజుల ఆలయానికి చేరుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పశువులు, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్పర్సన్ ఎండి అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్, కౌన్సిలర్ లతో కలిసి హాజరై రైతులకు పోలాల అమావాస్యశుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్పర్సన్ ఎండి అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్ లు మాట్లాడుతూ "మన దేశంలో సంస్కృతీ సంప్రదాయాలను, ప్రకృతిని, పశువులను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది అన్నారు. కంటికి రెప్పలా కాపాడే ఎద్దులను పూజించడం రైతులకు, మూగజీవాలకు ఉన్న అవినాభావ సంబంధానికి నిదర్శనం అన్నారు. నిరంతరం కష్టపడే రైతన్నలు సంతోషంగా ఉన్నప్పుడే సమాజం బాగుంటుందని, ఈ ఏడాది కాలం కలిసివచ్చి, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆశిస్తున్నాం అన్నారు. పట్టణ పరిధిలోని రైతుల సమస్యలపరిష్కారానికి, సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తాం" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బిన్ అహ్మద్, బాలకృష్ణ, బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బీన్ అబ్దుల్లా, బీ ఆర్ ఎస్ నాయకులు అశోక్, సాయి శ్రావణ్, పొన్నాల నారాయణ వివిధ గ్రామాల రైతులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News